నిమ్మగడ్డ లేఖలో నిగ్గు తేలాల్సిన అంశాలు మూడు ఉన్నాయి: విజయసాయిరెడ్డి

  • మరోసారి రాజకీయ దుమారం రేపుతున్న 'నిమ్మగడ్డ లేఖ'
  • కలుగులో ఎలుకలన్నీ బయటికి వస్తాయన్న విజయసాయి
  • నిమ్మగడ్డకు ముచ్చెమటలు పట్టినట్టున్నాయంటూ వ్యాఖ్యలు
కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది తానేనంటూ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వెల్లడించడంతో ఏపీలో మరోసారి రాజకీయ దుమారం రేగింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ వ్యవహారంలో తీవ్రంగా స్పందించారు. నిమ్మగడ్డ లేఖ అంశంలో నిగ్గు తేలాల్సిన అంశాలు మూడు ఉన్నాయని ట్వీట్ చేశారు. నిమ్మగడ్డ పేరుతో లేఖపై సంతకం చేసింది ఎవరు? ఆ లేఖను ఏ ఐపీ చిరునామా ద్వారా హోంశాఖ అధికారికి మెయిల్ చేశారు? అసలు ఆ లేఖను ఎక్కడ, ఎవరు డ్రాఫ్ట్ చేశారు? అనే మూడు అంశాలు పోలీసుల దర్యాప్తులో తేలితే కలుగులో దాక్కున్న ఎలుకలన్నీ బయటికి వస్తాయని వ్యాఖ్యానించారు.

కేంద్ర హోంశాఖకు రాసిన లేఖపై మీడియా వద్ద నోరు విప్పకుండా హైదరాబాద్ జారుకున్న నిమ్మగడ్డకు ఆ లేఖ విషయంలో పోలీసుల దర్యాప్తు కోరగానే ముచ్చెమటలు పట్టినట్టున్నాయని ఎద్దేవా చేశారు. అందుకే నెల తర్వాత, ఆ లేఖ రాసింది తానే అంటున్నారని విమర్శించారు. లేఖపై దర్యాప్తు జరిగితే ఎవరి మెడకు ఉచ్చు బిగుసుకుంటుందో ఇప్పటికి బోధపడినట్టయింది అంటూ మరో ట్వీట్ లో వ్యాఖ్యానించారు.

Vijay Sai Reddy
Nimmagadda Ramesh
Letter
Centre
SEC
Local Body Polls
Andhra Pradesh

More Telugu News